Tuesday, June 7, 2011

నిలువెత్తు నిర్లక్ష్యం



అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యంతో 
మహనీయులకు మరొక సారి అవమానం


ఆందోళన కారుల చేతిలో పూర్తిగా ధ్వంసమైన విగ్రహాలు ఎంతో పుణ్యం చేసుకున్నాయి. కనీసం ఆనవాలు లేకుండా నీటి పాలై, ఆ మహనీయుల పరువు నిలిపాయి. 


కాని, ఈ విగ్రహం అత్యంత హేయమైన, నీచమైన, అనాగరికమైన నిర్లక్ష్యానికి గురయ్యింది. మార్చ్ 10 వ తేదీ .. ఇదే విగ్రహం నడి రోడ్డు మీద పడిఉంది. ఆ తర్వాత రెండు రోజులు ట్యాంక్ బండ్ మధ్య మలుపు లో పేవ్ మెంట్ మీద (మెడ కు ఉరి తాడుతో సహా  అలాగే) గడిపడం నేను చూసాను.  ఆ తర్వాత కొన్ని దిన పత్రికల్లో వచ్చిన విమర్శలతో, ప్రభుత్వ అధికారులు ఈ విగ్రహాన్ని రవీంద్ర భారతి ప్రాంగణానికి తరలించారు. అక్కడ ఈ ఫోటో లో ఉన్న స్థితి లో, మూత్ర శాలల నడుమ,  చాల రోజులనుంచి ఉన్నట్టు ఇది వరకే, ఇంకొక దిన పత్రికలో చదివాను. 

మనకు మహనీయుల విగ్రహాలు ఎందుకు? వారికి కనీస గౌరవం ఇవ్వలేని ప్రజలు, ప్రభుత్వాలు ఉన్నంత కాలం మన తెలుగు వెలుగుల గతి ఇంతే. ఇతర భాషల వాళ్ళు, వారి మహనీయులని ఇలాగే "గౌరవిస్తున్నారా"? 

మన సాంస్కృతిక శాఖ వారి పని తీరుకు మరొక్క సారి నా జోహార్లు.  దయ చేసి మళ్లీ కొత్త విగ్రహాలు చేయించి కొత్త అవమానాలు చేయకండి.


Friday, October 8, 2010

రోబో- నా సొంత రివ్యూ

 రోబో ఇప్పటికే ప్రపంచమంతా సంచలనాలు సృష్టిస్తోంది... కొత్తగా చెప్పడానికి ఏమి లేకుండా వ్యూలు,  రివ్యూలు వచ్చేశాయి.
కాని నా కంటితో చూసి నా సొంత రివ్యూ రాస్తే ఎలా వుంటుంది అనుకున్నా. అది ఇలా ఉంది.



రోబో కి స్వంత తెలివి, ఆలోచన, విచక్షణ, స్పందన, సందర్భోచిత ప్రవర్తన ఉండవు కాబట్టి అవి ఎన్నటికీ మనుషులకు ప్రత్యామ్నాయం కాలేవు... ఒక వేళ అటువంటి తెలివిని వాటిలో ప్రవేశ పెట్టినా ఆ ప్రయత్నం  వినాశనానికి దారి  తియ్యొచ్చు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. పనిలో పనిగా మనుషుల్లో కూడా తెలివి వికటిస్తే ఇలాంటి పరిణామాలే ఉంటాయని దర్శకుడు కన్వే చేసాడు. తనను సృష్టించిన "దేవుడికి" ద్రోహం చెయ్యడానికి ఒక రోబో ప్రయత్నం, అందువల్ల కలిగిన విధ్వంసం, హీరో తన సృష్టిని తన నియంత్రణ లోకి ఎలా తెస్తాడు అనే విషయాలను దర్శకుడు తన ప్రతిభ, సాంకేతిక నిపుణుల సామర్ధ్యం, నటీనటుల నట పాటవం తో ఎంతో అందంగా భారీ గా తెరకి ఎక్కించాడు.

ఇంతకంటే వివరాలు మీకు చెప్పకుండా డైరెక్ట్ గా విషయానికొస్తే ...

రోబో మూవీ రజనికాంత్ తప్ప వేరొకరు చేస్తే ? సినిమాలో ఈ రకమైన ఫీల్ ఉండేది కాదు. ఇంత డిమాండ్ ప్రపంచమంతా ఉండేది కాదు. ఇంత ఖర్చుకు తగ్గ రాబడి పూర్తిగా అనుమానమే !! అందుకే,  ఈ సినిమా కి రజనికాంత్ మాత్రమె కరెక్ట్.
ఈ సినిమా కి రజనికాంత్ మాత్రమె కరెక్ట్
రెహ్మాన్ సంగీతం : అంత గొప్పగా లేదు. సినిమా స్థాయికి తగ్గ పాటలు, BG మ్యూజిక్ లేవు.

సాంకేతికంగా ఈ చిత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి. భారతీయ సినిమాల స్టాండర్డ్ ప్రకారం ఇందులో చూపిన గ్రాఫిక్స్, టెక్నిక్, మిక్సింగ్ ఎంతో ఉన్నత స్థాయి లో ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరింది.  కానీ Terminator  2 , I Robo లాంటి సినిమాలు చుసిన వాళ్లకు మనం ఇంకా చాలా వెనక బడినట్టు అనిపించడం సహజం.

మొత్తానికి రజని presence , హ్యూమన్ టచ్ , కళ్ళు మిరుమిట్లు కొలిపే గ్రాఫిక్స్ ఈ సినిమాని సూపర్ హిట్ చేసాయి.
Verdict : ఒక సారి చూడొచ్చు.

Tuesday, October 5, 2010

నోబెల్ బదులు.... నవ్వులపాలు!!

నేను ఎంతో ఆలోచించి నా బ్లాగ్ కి THINK DIFFERENT అని పేరు పెట్టాను.
కాని డిఫరెంట్ గా థింక్ చేస్తే మన దేశం లో ఎలాంటి మర్యాద దొరుకుతుందో ఈ రోజే తెలిసింది. 

ఈ క్లిప్పింగ్ చూడండి... 
(Courtesy : Andhra Jyothi Newspapaer dated 05.10.2010)
నిజానికి ఇది ఎప్పుడో జరిగిన కథ. నోబెల్ బహుమతి సాధించ డానికి అన్ని అర్హతలూ ఉన్న ఒక డాక్టర్ జీవితం ఎలా విషాదాంతం అయిందో చదివితే కళ్ళు చెమరుస్తాయి. 



 West Bengal లో కమ్యునిస్ట్ ప్రభుత్వం మూర్ఖపు నమ్మకాలకు ఊతమివ్వదని ఇన్నాళ్ళూ పొరబడ్డాను. ఎక్కడైనా నాయకులు అధికారులు ఇంతేనేమో!! 

డాక్టర్ ముఖోపాధ్యాయ కు సముచిత గుర్తింపు ఆయన బ్రతికుండగానే ఇచ్చి వుంటే ఆయన ఇంకా ఎంతో సాధించి మన దేశానికి పేరు తెచ్చి ఉండే వారేమో ! బహుశా నోబెల్ బహుమతి కూడా షేర్ చేసుకునే వారేమో!

>>అంధ్రజ్యోతి పూర్తి కధనం<<

మన 'బ్రహ్మ'కు మరణ శాసనం
రెండో టెస్ట్‌ట్యూబ్ బేబీ సృష్టికర్త భారతీయుడే

1978లోనే పరిశోధనలు
ముఖోపాధ్యాయ విజయాన్ని గుర్తించని బెంగాల్ ప్రభుత్వం
విచారణ పేరిట వేధింపులు
జపాన్ వెళ్లకుండా కేంద్రం అడ్డుపుల్ల
నిరాశా నిస్పృహలతో ముఖోపాధ్యాయ ఆత్మహత్య
ఆలస్యంగా లభించిన గుర్తింపు
ఈ ప్రపంచపు తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ లూసీ బ్రౌన్! పుట్టింది 1978 జూలై 25న, బ్రిటన్‌లో!
మరి రెండో టెస్ట్‌ట్యూబ్ బేబీ ఎక్కడ పుట్టిందో తెలుసా?
ఆ అమ్మాయి పేరు దుర్గ, పుట్టింది 1978 అక్టోబర్ 3న, కోల్‌కతాలో!
ఔను... ఇది నిజం!

బ్రిటన్‌లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ పుట్టిన 67 రోజులకే... భారత్‌లో రెండో టెస్ట్‌ట్యూబ్ బేబీ పుట్టింది. కోల్‌కతాకు చెందిన డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ ఈ విజయం సాధించారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్)లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆయన తాను సాధించిన విజయాన్ని ఎలుగెత్తి చాటారు.

కానీ... ఆయన మాటలను ఎవ్వరూ నమ్మలేదు. పైగా.. ఆయనను వెలివేసినట్లుగా చూశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమూ ఆయన పరిశోధనను గౌరవించలేదు. భారత ప్రభుత్వమూ ఆయనను పట్టించుకోలేదు. చివరికి... తన పరిశోధన పత్రాలను జపాన్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సులో ప్రవేశపెట్టేందుకు వెళతానని నెత్తీ నోరూ బాదుకుని ప్రాధేయపడినా అనుమతి నిరాకరించారు.

దీంతో డాక్టర్ ముఖోపాధ్యాయ 1981 జూన్ 19న కోల్‌కతాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు! ఇదీ.. ఒక మహా శాస్త్రవేత్తకు మన దేశంలో లభించిన గౌరవం! ముఖోపాధ్యాయ విషాదాంతాన్ని నేపథ్యంగా తీసుకుని ప్రముఖ దర్శకుడు తపన్ సిన్హా 'ఏక్ డాక్టర్‌కీ మౌత్' (ఒక వైద్యుడి మరణం) పేరిట సినిమా కూడా తీశారు.

బ్రిటన్‌లో డాక్టర్ ఎడ్వర్డ్స్, డాక్టర్ స్టెప్టోయ్‌లు కృత్రిమ గర్భధారణపై పరిశోధనలు చేస్తున్న సమయంలోనే... భారత్‌లో ముఖోపాధ్యాయ ఇదే అంశంపై దృష్టి సారించారు. కృత్రిమ గర్భధారణ విధానాన్ని కనుగొన్నారు. ఈ ప్రయోగం ద్వారానే 'దుర్గ' అలియాస్ కానూప్రియ అగర్వాల్ జన్మించింది.

అయితే... ముఖోపాధ్యాయ విజయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా... ఐవీఎఫ్‌పై తదుపరి పరిశోధనలు చేయకుండా అడ్డుకుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించి దీనిపై విచారణకు ఆదేశించింది. ఆధునిక పునరుత్పాదక పరిజ్ఞానంపై అవగాహన ఉన్నవారెవరూ ఈ కమిటీలో లేరు. దీంతో... ఉపాధ్యాయుడిని ఒకటో తరగతి పిల్లాడు ప్రశ్నించినట్లుగా ఈ దర్యాప్తు తయారైంది.

ఈ పిండాలను మీరు ఎక్కడ పెట్టారు? యాంప్యూల్ (తొలి దశలో పిండాన్ని ఉంచే ట్యూబు)కు ఎలా సీలు వేశారు? సీలు వేసేటప్పుడు పిండం చనిపోదా? ఇలాంటి అవగాహనలేని ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు ముఖోపాధ్యాయ చెప్పిన సమాధానాలు వారి బుర్రకు ఎక్కలేదు. చివరికి... కృత్రిమ గర్భధారణలో విజయం సాధించానన్న ఆయన ప్రకటన ఉత్తి బోగస్ అని కమిటీ సభ్యులు తేల్చారు.

స్వదేశంలో ఎలాగూ గుర్తింపు లభించలేదు, కనీసం విదేశాలకైనా వెళ్లి తన పరిశోధన పత్రాలను సమర్పించాలని ముఖోపాధ్యాయ భావించారు. కానీ... కేంద్రం ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. జపాన్‌కు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ముఖోపాధ్యాయ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనతోపాటు... ఆయన సాధించిన విజయం కూడా సమాధి అయింది.

ఎలా బయటపడిందంటే...
1986 ఆగస్టు 16న పుట్టిన హర్షయే భారత్‌లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ అని, ఐఆర్ఆర్ డైరెక్టర్ టి.సి.ఆనంద్ కుమార్ ఈ విజయం సాధించారని రికార్డుల్లో నమోదైంది. ఆనంద్ కుమార్ 1997లో 'సైన్స్ కాంగ్రెస్'లో పాల్గొనేందుకు కోల్‌కతా వెళ్లారు. అక్కడ ఆయనను కొందరు కలిశారు. 'మీకంటే చాలా ముందే డాక్టర్ ముఖోపాధ్యాయ టెస్ట్‌ట్యూబ్ బేబీని సృష్టించారు.

ఈ పత్రాలు చూస్తే మీకే తెలుస్తుంది' అని ముఖోపాధ్యాయ రూపొందించిన పరిశోధన పత్రాలను ఆనంద్ కుమార్‌కు అప్పగించారు. ఈ పత్రాలను ఆనంద్ కుమార్ నిశితంగా పరిశీలించారు. భారత్‌లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీని సృష్టించింది తాను కాదని, ఈ ఘనత ముఖోపాధ్యాయకే చెందుతుందని ఆయన తేల్చారు.

దీంతో ప్రభుత్వం కూడా రికార్డులు తిరగరాసింది. భారత తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ 'దుర్గ' అని, ఇది ముఖోపాధ్యాయ సాధించిన విజయమని నిర్ధారించింది. ప్రస్తుతం ఢిల్లీలోని ఒక బహుళ జాతి కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న ఆమె తనను సృష్టించింది ముఖోపాధ్యాయేనని మరోసారి ప్రకటించారు.

Sunday, September 19, 2010

బహుదూరపు బాటసారి






చ్చ తెలుగు నటన కు అచ్చమైన ప్రతిరూపం
కిక్కిచ్చే పాత్రల్లో మెప్పించిన అభినయం 
నేనంటే నేనే అనిపించుకున్న నటవిశ్వరూపం
నిజమైన నిండు జీవితానికి నిలువెత్తు తార్కాణం




బహుదూరపు బాటసారి,  
ఆంధ్రుల అందాల 
అభిమాన నటుడు,  
అక్కినేని నాగేశ్వర రావు గారికి
జన్మ దిన శుభాకాంక్షలు ...

Saturday, September 18, 2010

దారి తప్పిన న్యాయ-వాదం

ప్రతి శనివారం ఆంద్ర జ్యోతి దిన పత్రిక లో ఆదిత్య పేరుతొ కొన్ని వ్యాసాలు ప్రచురితం అవుతున్నాయి.    చదువుతున్నారా?

ఈ రోజు ప్రచురించిన వ్యాసం ఆలోచనాత్మకంగా ఉంది. మీరూ చదవండి.

దారి తప్పిన న్యాయ-వాదం
- ఆదిత్య

రాష్ట్రంలో గతవారం రోజులుగా, ముఖ్యంగా గడచిన మూడు రోజులుగా హైకోర్టు ఆవరణలో చోటు చేసుకు న్న సంఘటనలను గమనిస్తే, భవిష్యత్తులో పరిణామాలు ఏవిధంగా ఉండబోతున్నాయో ఊహించుకోవాలంటేనే భయం వేస్తున్నది. ప్రస్తుతం జరిగిన సంఘటనలకు కారణమైన వారు తాత్కాలికంగా ప్రయోజనం పొందుతూ ఉండవచ్చు. కానీ, తాము ఈరోజు నెలకొల్పిన సంస్కృతి, రేపు తమ మెడకు చుట్టుకోబోతున్నదన్న వాస్తవాన్ని వారు గమనంలోకి తీసుకోవలసిన అవసరం ఉంది.


ఉద్యమకారులు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని ఎవరైనా వాదిస్తే చేయగలిగింది ఏమీ లేదు. కానీ, ఇవ్వాల్టి మన చర్యలను భవిష్యత్తులో ఉద్యమాలు చేసే వాళ్లు ఆదర్శంగా తీసుకుంటే? ఇవ్వాళ ఉద్యమకారులుగా ఉన్న వాళ్లు, రేపు అధికారంలో ఉండవచ్చు. అప్పుడు పరిస్థితి ఏమిటి? అని ఆలోచించుకుని విజ్ఞతతో వ్యవహరించవలసిన బాధ్యత ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న వారిపై కచ్చితంగా ఉంది.


తెలంగాణ సెంటిమెంట్‌ను ఆసరాగా తీసుకుని ఏమి మాట్లాడి నా, ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనుకోవడం అవివేకమే అవుతుంది. విద్వేషాలు పెంచి పోషించడం ఎవరికైనా సులువే. కానీ, మన పూర్వీకులు నిర్మించిన వ్యవస్థలను, సంప్రదాయాల ను విధ్వంసం చేస్తే, వాటిని పునరుద్ధరించడం అంత తేలికైన విషయం కాదు. ప్రజల్లో ఆవేశాలు రెచ్చగొట్టడం ఎవరైనా చేయగలరు. కానీ, ఆవేశాలకు దూరంగా, ఆలోచనతో వ్యవహరించేలా ప్రజలకు నాయకత్వం వహించే వాళ్లే నిజమైన నాయకులు గా మిగులుతారు.


అయితే, జరుగుతున్న పరిణామాలు అందు కు భిన్నంగా ఉంటున్నాయి. ఎరువుల కొరత సమస్యపై ధర్నా చేయడానికి మహబూబ్‌నగర్ పర్యటనకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై దాడి చేయడం, కరీంనగర్ జిల్లాలోని ములకనూరు సహకార సొసైటీ పనితీరును పరిశీలించడానికి వెళ్లిన గృహ నిర్మాణ శాఖ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డిపై దాడికి పూనుకోవడం వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికి ఉండవచ్చు. సీమాంధ్రకు చెందిన వాళ్లన్న పేరిట ఎవరినీ తెలంగాణలో తిరగనివ్వబోమనడం సమర్థనీయం కాదు. ఈరెండు సంఘటనల వెనుక రాజకీయ వ్యూహాలు ఉండి ఉండవచ్చు. కానీ, హైకోర్టులో జరిగిన సంఘటనలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు.


ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వంటి పదవులలో 42 శాతం పోస్టులను, తెలంగాణ వారితోనే భర్తీ చేయాలని కోరు తూ తెలంగాణ న్యాయవాదులు ప్రారంభించిన ఉద్యమం శ్రుతి మించి న్యాయ వ్యవస్థనే ఆత్మ రక్షణలో పడవేసింది. ఆవేశంతో, ఆగ్రహంతో ఊగిపోయిన పలువురు తెలంగాణ న్యాయవాదు లు, తాము దైవంగా భావించవలసిన కోర్టు హాళ్లలోకి జొరబడి, న్యాయమూర్తులను, సీమాంధ్ర న్యాయవాదులను బండబూతులు తిట్టడం ఎంతవరకు సమర్థనీయం!


మూడు రోజులపాటు హైకోర్టులో అరాచక పరిస్థితులు నెలకొన్నా, సెలవులో వెళ్లిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కక్రూ తిరిగి వచ్చి తగు ఆదేశాలు ఇచ్చే వరకు, పరిస్థితులను చక్కదిద్దడానికి ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మీనాకుమారి గానీ, ఇతర సీనియర్ న్యాయమూర్తులుగానీ ఎందుకు చొరవ తీసుకోలేకపోయారు? న్యాయవాదుల చర్యల వల్ల నష్టం ఎవరికి? ప్రభుత్వం పరిష్కరించవలసిన సమస్యను, హైకోర్టు ఆవరణలో, కోర్టు హాళ్లలో పరిష్కరించాలని కోరడంలోని ఔచిత్యం ఏమిటి? ఇలాంటి మరె న్నో ప్రశ్నలకు అటు తెలంగాణ న్యాయవాదులు, వారిని వెన్నుతట్టి ప్రోత్సహించిన తెలంగాణ ఉద్యమ నాయకులు, ఇటు న్యాయమూర్తులు సమాధానం చెప్పవలసి ఉంది.


జరిగిన సంఘటనలకు మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసిన న్యాయమూర్తి జస్టిస్ సి.వి. నాగార్జునరెడ్డి, శుక్రవారం నాడు రాజీనామాను ఉపసంహరించుకోవడానికి ససేమిరా అనడాన్ని గమనిస్తే, ఈ సంఘటనల వల్ల ఏర్పడిన గాయం ఇప్పట్లో మానుతుందా? అన్న అనుమానం కలుగుతోంది. జస్టిస్ నాగార్జున రెడ్డి రేపోమాపో తన రాజీనామాను ఉపసంహరించుకోవచ్చు.


కానీ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, రాగ ద్వేషాల కు తావులేని రీతిలో వ్యవహరించడం ద్వారా గౌరవం పొందవలసిన న్యాయమూర్తులనే, ప్రాంతాల వారీగా టార్గెట్ చేయడానికి వారి ప్రవర్తనే కారణమా? న్యాయవాదుల అరాచకం కారణ మా? ఏకంగా కోర్టు హాళ్లలోకే జొరబడి, న్యాయమూర్తులనే దూషించే ధైర్యం న్యాయవాదులకు ఎలా వచ్చింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? ఈ సందేహాలకు ముందుగా సమాధానాలు అన్వేషించవలసి ఉంది.


వ్యవస్థలను కుప్పకూల్చుకుంటూ పోవడం వల్ల ఏమి జరుగుతుందో ఇప్పుడు మన హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులకు అర్థమై ఉంటుంది. తెలంగాణ న్యాయవాదులకూ ఈ సంగతి భవిష్యత్తులో తెలిసి వస్తుంది. న్యాయమూర్తులు న్యాయమూర్తులుగా కాకుండా, కుల, మత, ప్రాంతాల వారీగా విడిపోయి, రాజకీయ రంగు కూడా వేసుకోవడం వల్లే ప్రస్తుత దుస్థితి దాపురించింది. ఇప్పుడున్న పరిస్థితులలో హైకోర్టు ఎలా పనిచేస్తున్న ది? ఆయా వ్యాజ్యాల్లో అనుకూల ఉత్తర్వులు రావడానికి న్యాయవాదులు చేసే వాదనలు మాత్రమే సరిపోతున్నా యా? వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి.


న్యాయమూర్తుల వ్యవహార శైలిపై ఎప్పటి నుంచో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు కూడా ఇటీవలి కాలం లో పెరిగిపోయాయి. ఆదర్శంగా వ్యవహరించవలసిన న్యాయమూర్తులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు శాంపిల్‌గా మాత్రమే తెలిసింది. మున్ముందు పరిస్థితులు ఇంతకంటే ఘోరంగా ఉండబోతున్నాయి. కోర్టు హాళ్లలోకి చొచ్చుకు వచ్చి కోర్టుల పనిని అడ్డుకున్న న్యాయవాదులను నిలువరించలేని నిస్సహాయస్థితిలో జస్టిస్ మీనాకుమారి ఎందుకు ఉండిపోయారో ఆమె సమాధా నం చెప్పవలసి ఉంటుంది.


పదోన్నతుల ఆరాటం నుంచి న్యాయమూర్తులు కూడా మినహాయింపు కాకపోవడం శోచనీ యం. ఇవ్వాళ జస్టిస్ నాగార్జునరెడ్డికి జరిగిన అవమానం, రేపు మరెవరికైనా జరగవచ్చు. అయితే, తమ ముందు అత్యంత వినయంగా 'మిలార్డ్' అంటూ సంబోధిస్తూ కేసులు వాదించే న్యాయవాదులకు, తమను దూషించే తెంపరితనం ఎందుకు వచ్చిందో ముందుగా న్యాయమూర్తులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన ప్రవర్తన, నడవడికను బట్టి ఎదుటి వాళ్లు మనల్ని గౌరవిస్తారన్న నానుడి ఉండనే ఉంది.


ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఏమి జరుగుతుందో హైకోర్టు న్యాయమూర్తులకే కాదు; మొత్తం దేశంలోని న్యాయ వ్యవస్థకే తెలిసి వచ్చేలా ఈ సంఘటనలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ పని తీరులో అవాంఛనీయ పోకడలకు అడ్డుకట్ట వేయవలసిన అవసరాన్ని ఈ సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. మనం ఎంతకాలం, ఏ పదవిలో ఉన్నామన్న విషయం కాదు. ఎంత ఆదర్శంగా విధులు నిర్వహించామన్నది ముఖ్యమన్న విషయాన్ని న్యాయమూర్తులకు గుర్తు చేయడం సాహసమే అవుతుంది. చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన న్యాయవాదులను నిలువరించే 'మోరల్ అథారిటీ' మన న్యాయమూర్తుల కు లేదా? ఉందో లేదో ఆయా న్యాయమూర్తులే ఆత్మ పరిశీలన చేసుకోవాలి.


ఇక న్యాయవాదుల విషయానికి వద్దాం. న్యాయాధికారుల పోస్టుల్లో 42శాతం కోటా కావాలని తెలంగాణకు చెందిన న్యాయవాదులు డిమాండ్ చేయడంలో ఆక్షేపణ ఏమీ లేదు. జనాభాలో వాటా (ఫెయిర్ షేర్) ప్రాతిపదికగా తమకు పోస్టు లు కేటాయించాలని వారు చేస్తున్న డిమాండ్ న్యాయమైనదే. ఆ మాటకు వస్తే అంతకంటే ఎక్కువ కావాలని కూడా డిమాండ్ చేయవచ్చు. కానీ ఆ డిమాండ్ సాధనకు వారు ఎంచుకున్న మార్గమే అత్యంత అభ్యంతరకరమైనది.


42 శాతం పోస్టులు ఇవ్వాల్సింది ఎవరు? ఆందోళన ఎక్కడ జరిగింది? అన్నదే ఇక్కడ ముఖ్యం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న, ఈ ప్రాంతానికి చెందిన న్యాయవాదులు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. డిమాండ్ సాధనకు అనుసరించిన విధానం సమర్థనీయమేనా అని వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. న్యాయవాదులకు మద్దతు ప్రకటించిన నాయకులు కూడా ఈ విషయంలో సంజాయిషీ ఇవ్వవలసి ఉంటుంది.


తెలంగాణ ఏర్పా టు కోసం జరుగుతున్న ఉద్యమాన్ని, న్యాయవాదుల డిమాండ్ ను వేర్వేరుగా చూడవలసి ఉంటుంది. లా ఆఫీసర్ల నియామకాల్లో 42 శాతం కోటా తెలంగాణ న్యాయవాదులకు దక్కకపోయి ఉండవచ్చు. అలా ఇప్పుడే జరిగిందా? ఇంతకు ముందు అన్యాయం జరగ లేదా? అనేది తేలవలసి ఉంది. ఇంతకు ముందు నుంచే ఈ పరిస్థితి ఉండి ఉంటే, ఇంత విధ్వంసకరంగా ఇప్పుడే ఎందుకు ప్రవర్తించవలసి వచ్చిందో వారే సమాధానం చెప్పాలి. ఇంతకంటే ముఖ్యమైన అంశం, ఈ డిమాండ్‌ను పరిష్కరించవలసింది రాష్ట్ర ప్రభుత్వం.


హైకోర్టు చేయగలిగింది ఏమీ లేదు! పరిధిలో లేని అంశంపై హైకోర్టు ఆవరణలో విధ్వంసకాండకు పాల్పడే బదులు, సచివాలయంలోగానీ, ముఖ్యమంత్రి నివాస గృహం వద్ద గానీ, ధర్నాలు, దీక్షలకు దిగి ఉంటే ఆక్షేపించవలసింది ఏమీ ఉండదు. ఇందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరించవలసి వచ్చిందో తెలంగాణ న్యాయవాదుల జె.ఎ. సి. నాయకులే చెప్పవలసి ఉంటుంది. తమ ఆవేదనను, ఆక్రోశాన్ని అర్థం చేసుకోవాలని జె.ఎ.సి. నాయకులు చెబుతూ ఉండవచ్చు.


కానీ, సమాజంలో రోల్‌మోడల్‌గా వ్యవహరించ వలసిన న్యాయవాదులు, తమ ప్రవర్తన ద్వారా ప్రజల్లో గౌరవాన్ని పొందుతున్నారో, చులకన అవుతున్నారో ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇప్పుడు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న న్యాయవాదులే, ఆ రాష్ట్రంలో న్యాయమూర్తులుగా నియమితులు కావచ్చు. ఇవ్వాళ న్యాయమూర్తులను అవమానించిన వాళ్లు, రేపు న్యాయమూర్తులుగా నియమితులైతే, వారికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే? 'నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా!' అని అప్పుడు న్యాయవాదులు ప్రశ్నిస్తే ఏమి సమాధా నం చెప్పగలరు? అలాగే గురువారం నాడు ఒక న్యాయవాది, తనపై పెట్రోల్ చల్లుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.


చట్టరీత్యా ఇది నేరం. ఈ సంగతి న్యాయవాదులకు తెలియనిది కాదు. ఇవ్వాళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ న్యాయవాదే, రేపు ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గానో, గవర్నమెంట్ ప్లీడర్‌గానో నియమితులు కావచ్చు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం తరఫున ఆయన వాదించవలసి రావచ్చు. తాను చేసింది తప్పు కానప్పుడు, ఇతరులు చేసింది తప్పని వాదించే నైతికత ఆ న్యాయవాదికి ఉంటుందా? ఈ చర్యలన్నీ తాత్కాలిక ప్రయోజనాలను లేదా ప్రచారాన్ని తెచ్చిపెట్టవచ్చు.


కానీ, మహోన్నతమైన సంప్రదాయాలను, చట్టాలను మనమే ఉల్లంఘిస్తే, జరగబోయే పరిణామాలకు మనం కూడా బలవుతామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవలసి ఉంది. న్యాయం కోసం వచ్చే వారిని అక్కున చేర్చుకుని, న్యాయాన్ని అందివ్వవలసిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమే, ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. అటు న్యాయమూర్తుల కు, ఇటు న్యాయవాదులకు కూడా ప్రవర్తనా నియమావళి ఉంటుంది. ఎవరికి వారు దాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించడం వల్లే ప్రస్తుత దుస్థితి దాపురించింది.


న్యాయ వ్యవస్థలో కూడా ప్రాంతీయ వైషమ్యాలు చొరబడ్డ తీరు చూస్తే ఎవరికైనా మనసు వికలం కాకమానదు. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్న నాయకులు, సంఘాల ప్రతినిధు లు, అటు సమైక్యాంధ్ర కావాలంటూ హడావుడి చేస్తున్న నాయకులు ఈ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి భవిష్యత్తును ఇవ్వబోతున్నారో స్పష్టం చేయవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇలాగే ఉండవచ్చు. లేదా రెండు రాష్ట్రాలు కావచ్చు. లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు.


అది నాయకుల సమస్య మాత్రమే కాదు. ప్రజల సమస్య! రాష్ట్ర విభజన సమస్య పరిష్కారానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. విద్వేషాలు రెచ్చగొట్టడం మాత్రం సరైన విధానం కాదు. దీనివల్ల అమాయక ప్రజలు నలిగిపోతారన్న వాస్తవాన్ని గుర్తించి, నాయకులు విజ్ఞతతో వ్యవహరించాలని కోరుకోవడం అత్యాశ కాకూడదు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు పెచ్చరిల్లితే ఎవరికి మాత్రం సుఖం మిగులుతుంది?! సమస్య కానిది సమస్యగా మారకూడదు.


ఉద్యమ నాయకులకు గానీ, తెలంగాణ ఉద్యమ నేతలకు గానీ, సమైక్య వాదన వినిపించే నాయకులకు గానీ, ప్రజల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలన్నీ చిటికెలో పరిష్కారం అవుతాయని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. ఆ కారణంగానే సెంటిమెంట్ గ్రామ స్థాయి వరకు బలంగా వ్యాపించింది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ ఏర్పడినా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం అంత సులువు కాదన్న వాస్తవాన్ని ఉద్యమ నాయకులు గుర్తించి, ఇప్పటి తమ చర్యలు మున్ముందు తమకే ఎదురుకొట్టకుండా సంయమనంతో వ్యవహరించడం మంచిది.

Tuesday, September 14, 2010

ఈ ఫోటో ఎవరిదో తెలుసా ?

గుర్తు పట్టారా ?

  
ఇంకా తెలియ లేదా?





విశ్వ విఖ్యాత నట సార్వభౌమ డా. నందమూరి తారక రామారావు




















.

ఇప్పుడు సమయం ..